
About River Kshipra in Telugu
1. అమృత వాహిని క్షిప్రా నది
మహాకాల శ్రీ శిప్రా గతిశ్చైవ సునిర్మలా
ఉజ్జయిన్యాం విశాలాక్షి వాసః కస్య న రోచతే
స్నానం కృత్వా నరోయస్తు మహాన్ ఘామహి దుర్లభం
మహాకాలం నమస్కృత్య నారో మృత్యుం న శోచతే|
మహాకాలుని భూమిలో ప్రవహించే శిప్రా (క్షిప్రానది) నిర్మలమైనది. స్వచ్చమైనది. ఉజ్జయిని విశాలాక్షి చల్లని చూపులు ప్రసరించే క్షిప్రానది లో స్నానమాచరించిన వారిని అప మృత్యువు ఎన్నడూ దరిచేరదు.
క్షిప్రానది ఎక్కడో కొండలనుంచీ గుహలనుంచీ జాలువారినది కాదు. ఈ నది నేలనుంచీ ఉద్భవించింది. ప్రజల జీవితాలలో ఆనంద ధారగా ప్రవహించింది. అందుకే క్షిప్రా నదిని లోక సరిత అంటారు. భారత దేశం లోని చాలా నదులు దక్షిణానికి ప్రవహిస్తాయి. కానీ క్షిప్రానది ఉత్తర గామి. క్షిప్రానది గొప్పదనం గురించి వేదాలలో కూడా చెప్పబడింది. మహాభారత రామాయణాలలో క్షిప్రా నది ప్రసక్తి వస్తుంది. స్కాంద పురాణం లో ఈ నది కి సంబంధించిన గాధ చెప్పబడింది.
క్షిప్రానది ఎలా జన్మించింది?
మహాకాలుడు ఒకనాడు ఆకలితో భిక్షాటనకు బయలుదేరాడు. ఆయన విష్ణుమూర్తి వద్దకు వెళ్ళగా విష్ణుమూర్తి మహాకాలునికి బిక్షనివ్వలేదు. మహాకాలుని తిరిగి వెళ్ళమని వేలితో చులకనగా బయటికి దారిచూపించాడు. విష్ణుమూర్తి చర్యకు ఆగ్రహించిన మహాకాలుడు త్రిశూలంతో విష్ణుమూర్తి వేలిని గాయపరిచాడు. ఆయన వెలినుంచీ రక్తం ప్రవహించసాగింది. ఆ రక్త ధారను ఆపడం ఎలాగో అంతుపట్టని మహాకాలుడు మహావిష్ణుని రక్తం కిందపడకుండా తన చేతిలోని కాపాలాన్ని పట్టాడు. విష్ణు మూర్తి రక్తం ఆ కపాలం నిండి అందులోనుంచీ పొరలింది. అలా పొరలి నేలకు జారిన విష్ణుమూర్తి రుధిర ధార క్షీప్రా నది అయిందని స్కాంద పురాణం లోని ఒక గాథ.
మరొక కథ :
అత్రి మహాముని ఎన్నో సంవత్సరాలు భగవాత్సాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ఆయన చేతులెత్తి నమస్కార భంగిమలో తపమునాచరించాడు. ఆయన తపస్సు ముగిసే సమయానికి ఆయన చేతులలో ఒకటి చంద్రుని గానూ మరొకటి క్షీప్రా నది గానూ అవతరించిందని ఒక కథ ప్రచారం లో ఉంది.
దేవదానవులు సాగర మథనం చేసినప్పుడు అమృత భాండం వెలువడింది. ఆ అమృత భాండామ్ కోసం వారు తగవులాడుకునే సమయం లో క్షీప్రా నదిలో కొన్ని అమృత బిందువులు చిందాయని. పురాణ గాధ. అందుకే క్షీప్రా నదిని సోమవతి అనికూడా అంటారు.