పూర్వం ఒక రాకుమారి శివుని పెండ్లాడాలనుకొని, మల్లి పూవులతోను, అర్జున పుష్పాలతోను పూజించేది. ఒకరోజు శివుడు ఆమెకు కలలో కనిపించి ఒక తుమ్మేడను చూపించి, అది వాలినచోట వేచి ఉండమని, తాను వచ్చి పెండ్లాడుతానని చెప్పాడు.
ఆమెకి మెలుకవ వచ్చి, కళ్ళూ తెరువగానే ఒక భ్రమరం ఎగురుతూ కనిపించింది. ఆ తుమ్మెదను అనుసరిస్తూ, శ్రీశైల ప్రాంతములోని అడవిలో ఒక పొదమీద వాలడం చేత అక్కడ శివుని ధ్యానిస్తూ నిరీక్షించ సాగింది.
ఆ అడవిలోని చెంచులు పాలు, పండ్లు, తేనె మొదలగునవి ఆమెకు ఆహారంగా ప్రతిరోజూ ఇచ్చేవారు.
ఒకరోజు పార్వతితో కూడి అక్కడకు శివుడు వచ్చి, అ కాకుమారిని చూపించి, ఆమె తనను వివాహమాడదలచుకొన్నదని తెలిపాడు.
దానికి పార్వతి హేళనగా చేసింది. శివుడు తన మాటలను నిరూపించ దలచి, ఆ రాకుమారి దగ్గరకు ఒక ముసలివాని రోపంలో వెళ్ళి, “రాకుమారి, నీకోసం వెతుకుతూ ముసలివాడనయ్యి, ఇంతకాలానికి నిన్ను చేరాను, నా ముసలి రూపమును లెక్క చేయక, నన్ను వివాహమాడుతావా?” అని అడిగాడు.
అందుకామె ఒప్పుకొని, చెంచులు వద్దన్నావినక, శివుని వివాహమాడింది. చెంచులు క్రొత్త అల్లునికోసం మద్య-మాంసాలతో విందు ఏర్పాటు చెస్తే, శివుడు అలిగి, విందును అంగీకరించకుండా వెళ్ళిపోసాగాడు.
ఆమె శివున్ని మల్లయ్య … ఓ చెవిటి మల్లయ్య! అగు… నిలబడు అని గట్టిగా పిలిచిన, శివుడు లెక్క చెయ్యకపోయేసరికి, రాయిలాగా మాట్లాడవేమి? అక్కడే లింగంగా మారిపో అని శపించింది.
వృద్ధ రూపంలో ఉన్న శివుడు అక్కడే లింగంగా మారిపోయాడు. అందుకు పార్వతి రాకుమారిని చుసి, ఓసీ! భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపో అని శపించింది.
దాంతో ఆమె శివుని భార్యగా భ్రమరాంబ నామముతో నిలిచిపోయింది. అందుకనే భక్తులు, ఎప్పటికిని, స్వామిని వృద్ధ మల్లయ్య, ముసలి మల్లయ, చెవిటి మల్లయ్య అని పిలుస్తారు.