
Karya Siddhi Anjaneya
1. కార్యసిద్ధి ఆంజనేయుని ఆలయం
ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ కేరళ ప్రాంతం. అటువంటి కేరళప్రాంతం లో ప్రశాంతమైన నదీతీరం లో కార్యసిద్ధి హనుమంతుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి దత్తాంజనేయ స్వామి ఆలయమనే పేరు కూడా ఉంది.
ప్రశాంత నదీతీరం లో స్వామివారి ఆలయం
కేరళలోని ప్రధాన నదులలో ఒకటైన పెరియార్ నది ఎర్ణాకులం జిల్లాలోని లోని అలువ అనే ఊరివద్ద రెండుపాయలుగా విడిపోతుంది. ఒకపాయ అలువ లోని శివాలయం వద్ద ప్రవహిస్తుంది. పడమటి వైపుగా ప్రవహించే మరొక పాయ వద్ద ఉత్తరం వైపుగా శ్రీ దత్తాంజనేయస్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ యజ్ఞ యాగాదులు విరివిగా జరుగుతాయి.
ఆలయ నిర్మాణం – ప్రత్యేకత
శ్రీ కార్యసిద్ధి హనుమంతుని ఆలయం 1999 లో శ్రీ దత్త పీఠాధిపతులైన అవధూత శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందులవారు స్వయంగా ప్రతిష్ఠించారు. ఇక్కడి హనుమంతుని దర్శించి పూజించినవారికి సర్వకార్యములూ నెరవేరుతాయన్న ప్రతీతి. కార్య సిద్ధి హనుమంతుని రూపం అత్యంత ప్రసన్నంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. స్వామి దివ్యప్రభలు ఎటువంటి గ్రహపీడలనైనా, దుష్ట ప్రభావాలనైనా తరిమివేయగలవని భక్తుల విశ్వాసం. ఇక్కడ దత్తాత్రేయస్వామి ప్రధాన దేవత. వినాయకుని ఆలయం కూడా ఈ ప్రాంగణం లో దర్శించవచ్చు.
శ్రీ కార్య సిద్ధి హనుమంతుని ఆలయానికి ఎలా వెళ్ళాలి?
ఈ ఆలయం NH47 రహదారికి దగ్గరలో ఉంటుంది. అలువనుంచీ అంకమల్లి వెళ్ళేదారిలో స్వర్గం రోడ్డు గుండా వెళితే మంగళపుర వంతెన దాటిన తరువాత 200 మీటర్ల లో ఆలయం ఉంటుంది. కున్నుంపురమ్ నుండి కూడా అనంతపుర ఆలయం మీదుగా శ్రీ దత్తాంజనేయ స్వామి ఆలయాన్ని చేరుకోవచ్చు.