
Mangala Gowri Vratham 2025
1మంగళగౌరి వ్రతము
మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత!
అలాగే మన సంస్కృతిలోని తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు వంటివన్నీ, వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి.
చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని పన్నెండు నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ, వాటిలో “శ్రావణమాసం” ఉత్కృష్టమైంది.
ముఖ్యంగా శ్రావణమాసం మహిళకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడం వల్ల, “వ్రతాల మాసం”గా పేరు పొందడంతో పాటు, మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడుతోంది.
శ్రావణ మాస వ్రతాలనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది – “వరలక్ష్మీ వ్రతం”. ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం – “మంగళగౌరి వ్రతం.”
దీనికే “శ్రావణ మంగళవారప్రతం” అని, “మంగళ గౌరీ నోము” అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదువతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి.
ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడ ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి “అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీకృష్ణుడు “మంగళగౌరీ మహాదేవత, ఆ పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది.
త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించ గ్రహరాజై, మంగళవారానికి అధిపతై వెలుగొందుతున్నాడు.
ఆ మంగళ గౌరిని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారములలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు.
ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్జిల్లుతారు” అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.
వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? (Who can do Mangalaguri Vrat?)
మంగళగౌరీ వ్రతాన్ని క్రొత్తగా పెళ్ళయిన ముత్తైదువులు చేయాలి. అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి, శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారములు వస్తే, అన్ని వారాలు వ్రతాన్ని చేయాలి.
ఒక వేళ ఏవైనా ఆటంకములు ఏర్పడినా ఏదైనా ఒక వారం గానీ, రెండు వారాలు గానీ చేయలేకపోతే, అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి.
శ్రావణమాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలుకలుగదో,అన్ని మంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు.
అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్ళయిన సంవత్సరం నుంచి మొత్తం వరుసగా ఐదు సంవత్సరాల పాటూ ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి.
వ్రత నియమాలు (Rules of Mangalaguri Vratam)
- తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పడు, వ్రతం చేస్తున్న వారి తల్లి, ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒక వేళ తల్లి లేకపోయినట్లయితే, అత్తగానీ, లేదా ఇతర ముతైదువుల సహాయంతో గానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.
- వ్రతమును చేసే రోజు ఉదయం నిద్రలేస్తూనే, ముందుగా భర్త పాదాలకు, అనంతరం తల్లిదండ్రులు, అత్తమామలు, ఇతర పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి. వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి, ఫలహారం భుజించి ఉపవాసం ఉండడం శ్రేష్టం. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.
- వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
- వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
- వ్రతానికి తప్పనిసరిగా ఐదు మంది ముత్తైదువులు పేరంటానికి పిలిచి, వారికి వాయనములను ఇవ్వాలి. అయితే కొన్ని ప్రాంతాలలో మొదటివారం ఐదు మంది, రెండవారం పది మంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదువులను ఆహ్వానించి వాయనములు ఇచ్చే ఆచారం ఉంది. ఇది చేసే వారి శక్తిని బట్టి ఉంటుంది.
- ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక క్రొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటూ అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
- పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడిపూలు తప్పనిసరిగా వాడవలెను.