
Narasimha Jayanti In Telugu
1. నరసింహ జయంతి
“వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్”
వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనన నృసింహావతారమును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణంలో కలదు.
నరసింహ అవతార కథ (Narasimha Swamy Avatar Story)
శ్రీ మహా విష్ణుని నివాసమైన వైకుంఠానికి జయవిజయులనే సంరక్షకులు ఉండేవారు. వారు నారాయణుని పరమభక్తులు.
ఒకనాడు సనక సనందనాదులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు. వారు వచ్చిన సమయం శ్రీమహావిష్ణువు ఏకాంత సేవలో ఉండే సమయం కావడంతో జయవిజయులు వారిని అడ్డగించారు.
ఆగ్రహించిన సనక సనందనాదులు వారిరువురినీ శ్రీమహా విష్ణువుకి దూరంగా భూమండలం పై పలు జన్మలెత్తమని శపించారు.
జయవిజయులు సనకాదులను వేడుకొన్నారు. తమ కర్తవ్యాన్ని పాలించడం తప్ప తాము చేసిన తప్పేమీ లేదని, శాపవిమోచనం అనుగ్రహించమని, శ్రీ మహా విష్ణువుని అంతకాలం విడిచి ఉండలేమని ప్రార్థించారు.
జయవిజయుల అవతారాలు
శాంతించిన సనకాదులు శ్రీహరి భక్తులుగా ఏడు జన్మలు కానీ, ఆయన శత్రువులుగా మూడు జన్మలు కానీ ఎత్తి తిరిగి హరిసాన్నిధ్యం చేరుకుంటారని విమోచనం చెప్పారు. జయవిజయులు హరికి దూరమై ఏడు జన్మలు భక్తులుగా జన్మించేకంటే ఆయన చేతిలో సంహరింపబడి మూడు జన్మలలో తిరిగి వైకుంఠం చేరుకోవడమే ఉత్తమమని ఎంచుకున్నారు.
అలా శాపగ్రస్తులైన జయవిజయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ, కుంభకర్ణులుగా మూడవ జన్మలో శిశుపాల, దంతవక్త్రులుగా జన్మించారు. అలా కృత యుగం లో మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించి ఘోరమైన తపస్సులుచేసి, బ్రహ్మాదుల వద్ద వరాలను పొందారు. వరగర్వంతో లోకకంటకులైనారు. వారి పీడను వదిలించడానికి శ్రీహరి వరాహ రూపంలో హిరణ్యాక్షుని సంహరిస్తాడు.
హిరణ్య కశిపుని వైరం- ప్రహ్లాదుని భక్తి
శ్రీహరిపై అన్నను చంపాడన్న పగ పెంచుకున్న హిరణ్య కశిపుడు తపస్సుచేసి తనకు గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని, దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని, అస్త్రశస్త్రాలవల్లగాని, ఇంటగాని, బయటగాని, చావులేకుండా వరాల నుపొందాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన ప్రహ్లాదుడు కడుపులో ఉండగానే శ్రీ మహావిష్ణువుకు భక్తుడైనాడు. కొడుకు తన శత్రువైన శ్రీహరిణామస్మరణను చేస్తుంటే భరించలేని హిరణ్యకశిపుడు అతనిచేత హరినామస్మరణను మాన్పించాలని అనేక విధాలుగా ప్రయత్నించి ఓడిపోతాడు. చివరికి కొడుకుని చంపేయాలని నిర్ణయించుకుంటాడు.
నారసింహుని ఆవిర్భావం
శ్రీ హరి స్వయానా రక్షిస్తుంటే ప్రహ్లాదునికి భయమేమిటి? ఎన్నో మార్లు తండ్రి శిక్షలనుండి తప్పించుకున్నాడు బాలప్రహ్లాదుడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు శత్రువును కీర్తిస్తున్న ఆ పసివాణ్ణి, తన గారాల కొడుకుని తానే స్వయంగా సంహరించ పూనుకున్నాడు. రక్షించేవాడే అయితే ఆ హరిని పిలువమని గదతో స్తంభాన్ని మోదాడు.
హిరిణ్యకశివుడు మోదిన స్తంభమునుండి సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడై సగం మృగత్వం, సగం నరత్వం కలిగిన నరసింహుడై అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము గడపపైన హిరణ్యకశిపుని తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు. ఉగ్రుడైన స్వామిని ప్రహ్లాదుడు తన ప్రార్థనతో శాంతింపజేశాడు.
నమో నారసింహా
అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే ‘చతుర్దశి ‘ నాడు ఆవిర్భవించారు. ఆ పుణ్యదినమునే మనం “నరసింహ జయంతి” గా జరుపుకుంటూ ఉంటాము.
Narasimha Jayanti Mantra / Sloka
ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ।
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ॥
నరసింహ జయంతి తేదీ మరియు సమయం:
నరసింహ జయంతి ఆదివారం, మే 11, 2025
నరసింహ జయంతి శయన కాల పూజ సమయం – 16:05 నుండి 18:40 వరకు
వ్యవధి – 02 గంటలు 35 నిమిషాలు
నరసింహ జయంతి మరుసటి రోజు పారణ సమయం – 05:45, మే 12 తర్వాత
నరసింహ జయంతి పారణ దినాన చతుర్దశి సూర్యోదయానికి ముందే ముగుస్తుంది
నరసింహ జయంతి మధ్యాహ్న సంకల్ప సమయం – 10:55 నుండి 13:30 వరకు
చతుర్దశి తిథి ప్రారంభం – మే 10, 2025న 17:29
చతుర్దశి తిథి ముగుస్తుంది – మే 11, 2025న 20:01
Related Posts
శ్రీ నృసింహ అష్టోత్తర శతనామావళిః – Sri Narasimha Ashtottara Satanamavali
శ్రీ నృసింహ అష్టోత్తర శతనామ స్తోత్రం – Sri Narasimha Ashtottara Shatanama Stotram
సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం | Jainath Laxmi Narasimha Swamy Temple in Telugu.
Sri Ahobala Narasimha Stotram | Sri Ahobila Lakshmi Narasimha Swamy Stotram
Where did Lord Narasimha Swami go after killing the demon Hiranya Kashyapa?
ఋణ విమోచన నృసింహ స్తోత్రం | Sri Narasimha Runa Vimochana Stotram
చుక్కాపురంలో కొలువైన నృసింహస్వామి | Chukkapuram Narasimha Swamy Temple (Telugu)
Comment:very good article
thank you