
కాకి అరిస్తే చుట్టాలొస్తారన్న నమ్మకం ఏర్పడింది రామాయణం వల్ల. ఆంజనేయుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అంటే అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందన్నమాట. అలా ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. పైగా… ఆంజనేయుడు వచ్చాడన్నది సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే ఏదో శుభవార్త వస్తుందని కూడా నమ్ముతుంటారు.
ఇది మాత్రమే కాక… భారతదేశంలో కాకికి చాలా ప్రాధాన్యం ఉంది. కాకిని పితృదేవతలకు ప్రతినిధి అంటారు. శ్రాద్ధ కార్యక్రమాలు జరిపించాక, పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాలను కాకి వచ్చి ఆరగిస్తేనే ఆ మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. అలాగే కాకి చాలా తెలివైన పక్షి అని కూడా అంటారు. కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడితే, అవి పిల్లలు కాగానే కనిపెట్టేస్తుంది కాకి. అన్నీ ఒకలాగే ఉన్నా, కోకిల పిల్లల్ని గుర్తించి వాటిని వెళ్లగొడుతుంది. అందుకే దాన్ని తెలివైన పక్షిగా పేర్కొంటారు.