శ్రీ కంచే ఐలయ్య సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పేరుతో రచించిన గ్రంథంలో కోమట్లను, బ్రాహ్మణులను, కాంగ్రెసు పార్టీని, కాంగ్రెసు ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారుల్ని మహాత్మాగాంధీని, పండిట్ నెహ్రూను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిరాధారము, నిష్కారణము అసంబద్ధము నయిన ఆరోపణములతో విమర్శించారు.
పురుషోత్తముడైన శ్రీరాముని, శ్రీకృష్ణుని, వేదాలను గూడ విమర్శించ కుండ వదలలేదు. అవి చదివి కొన్ని వర్గాలు బాధపడితే, ఆ విమర్శలను నిజమని నమ్మి, కొన్ని వర్గాలు ఇతరులను ద్వేషించే స్థితికూడా ఉంది. కాబట్టి ఆ ఆరోపణముల స్వరూపాన్ని తెల్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము.
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకంలో ఆయన అనేకమైన ఆరోపణములు చేశారు. వాటిలో ఒక ఆరోపణం – తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బంతా బ్రాహ్మణీయ వినియోగానికే వెచ్చించబడుతోంది.
పరిశీలనం – తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి, ఉప కార్య నిర్వహణాధికారి, పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది, పబ్లికేషన్ కార్యాలయం ఉద్యోగులు, ధర్మ ప్రచారసమితి ఉద్యోగులు ఇలా అనేకోద్యోగులున్నారు. దేవస్థానానికి సంబంధించిన రవాణా వ్యవస్థ ఉంది. వచ్చిన భక్తులకు అన్నదానం చేసే వ్యవస్థ ఉంది. నివాసాలు కేటాయించే వ్యవస్థ ఉంది. పూలు మొదలయిన పూజాసామాగ్రిని సమకూర్చే వ్యవస్థ ఉంది. వీరిలో అన్ని కులాల వారు ఉన్నారు.
దేవస్థానం నిర్వహణలో విశ్వవిద్యాలయం, పెద్ద ఓరియంటల్ కళాశాల, మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ, పెద్ద హాస్పటల్ ఇలా ఎన్నో వ్యవస్థలు నడుస్తున్నాయి. వీటిలో అన్ని కులాలవారు ఉంటారు.
దేవస్థానం పైన దేవాదాయ ధర్మాదాయశాఖ ఉంది. ఆపైన ప్రభుత్వం ఉంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు బ్రాహ్మణీయ వినియోగానికి అని అనడం ఐలయ్య ఊహమాత్రమే.
డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణ శర్మ
ఐలయ్య చేసిన అపనిందలు – పరిసీలనం