
కైకేయి పొందిన వరాల వల్ల తండ్రి మాటకై శ్రీరామ చంద్రుడు అరణ్య వాసానికి సిద్ధపడ్డాడు. ధర్మపత్ని అయిన సీతాదేవి భర్తవెంటే తానూ అని రామునితోపాటు పయనమయింది. తండ్రి తో సమానంగా ప్రేమించిన తన అన్నను అడవులలో కాపాడటానికై లక్ష్మణుడూ వారివెంట నడిచాడు.
లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళాదేవి తన అక్క సీతబాటలోనే తన భర్త వెంట అడవులకు వెళ్లదలచుకుంది. కానీ లక్ష్మణుడు వారించాడు. దేవీ నేను అన్నా వదినల రక్షణార్థమై వెళుతున్నాను. నీవు రావడం వలన వారి సంరక్షణను నేను సమర్థవంతంగా పాలించలేను. నిన్ను విడిచి ఉండలేని వాడనే కానీ వెళ్ళక తప్పదు, నీవు నావెంట రావడమూ మంచిది కాదు. అని అన్నాడు. భర్త మనసును, అతని ఆశయాన్ని తెలుసుకున్న అర్ధాంగి ఊర్మిళ లక్ష్మణుని మాటకు అంగీకరించి అయోధ్యలోనే ఉండిపోయింది.
కానీ తన భర్తవలే సీతారాములను సేవించలేక పోయానని, తన భర్త ఆశయం లో పాలుపంచుకోలేక పోయాననీ ఊర్మిళ చింతించింది. అరణ్యం లో సీతారాములు నిద్రించుచుండగా లక్ష్మణుడు విల్లంబులు చేతబట్టి వారికి రక్షణగా కుటీరం బయట నిలబడ్డాడు. అతని వద్దకు నిద్రాదేవి సమీపించింది. లక్ష్మణుడు నిద్రాదేవిని ‘ అమ్మా నిద్రాదేవీ..! దయచేసి నా కర్తవ్యానికి ఆటంకం కలిగించకు. నేను అన్నావదినెల సేవకై వచ్చాను. ఈ పధ్నాలుగేండ్లు నన్ను విడిచి పెట్టు’ అని ప్రార్థించాడు. అతని భ్రాతృ భక్తికి సంతోషపడ్డ నిద్రాదేవి అందుకు అంగీకరించింది. కానీ ప్రకృతి ధర్మం తప్పదు కదా. కనుక అతని నిద్రను ఇంకెవరికైనా పంచమని చెప్పింది.
అప్పుడు వెంటనే లక్ష్మణుడు ‘ అమ్మా ఈ పధ్నాలుగేండ్లు నా నిద్రను నా భార్య ఊర్మిళకు ప్రసాదించు. ఆమెకు నా అభిప్రాయం తెలియజేయి, తప్పక అంగీకరిస్తుంది.’ అన్నాడు. లక్ష్మణుని మాట ప్రకారమే ఊర్మిళ సంతోషంగా అతని కర్తవ్యపాలనకు తనవంతు సహాయం చేసింది.
లక్ష్మణుని మెలకువకు మరొకకారణం ఉంది. రావణాసురుని కుమారుడైన మేఘనాథుని సంహరించాలంటే పధ్నాలుగేండ్లు నిద్రపోకుండా ఉన్నవానికే సాధ్యమని వరం ఉంది.ఊర్మిళ ఆయన నిద్రను తాను స్వీకరించడం వల్ల అతనిని సంహరించడానికి లక్ష్మణునికి అర్హత కలిగింది. ఊర్మిళాదేవి లక్ష్మణునితో పాటు అడవులకు రాకపోయినా అతని ధర్మపత్నిగా ఆమె తన ధర్మాన్ని నిర్వర్తించింది.