శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు. భగవద్గీత అర్జునికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానభాండాగారం వంటిది. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు. పాండవులకు ప్రతి కష్టం లోనూ కృష్ణపరమాత్ముడు వెన్నంటే ఉన్నాడు. వారికి ఎన్నో విషయాలను సమయానుకూలంగా బోధించాడు. అటువంటి వాటిలో కొన్ని..
1. దాహంతో ఉన్నవారికి మంచినీళ్లు ఇస్తే ధనప్రాప్తి కలుగుతుంది
దాహం తో ఉన్నవారికి ఎవరైనా సరే వారికి మంచినీళ్లు ఇవ్వడం ధర్మం. మంచినీళ్లు ఇవ్వడానికి కులం, మతం, ప్రాంతం చూడకూడదు. మనుషులకు మాత్రమే కాదు దాహార్తితో వచ్చిన ఏ జీవినైనా నీళ్ళిచ్చి ఆదుకోవాలి. నీరు అన్ని ప్రాణులకూ జీవనాధారమైనది. నీరు ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటుంది. అటువంటి నీటిని దానం చేయడం వల్ల సిరి సంపదలు జీవనదిలాగా నిరంతరంగా ప్రవహిస్తాయి. నీటిని వృధా చేయడం మహాపాపం. నీటిని దానం చేయడం మాత్రమే కాకుండా, సూర్య భగవానునికి తర్పణాలను విడవడం ద్వారా, ఇంటికొచ్చిన అతిథులను అర్ఘ్య, పాద్యాలిచ్చి సేవించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది.