మన ఆలోచనలనుబట్టే మన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఒక విషయాన్ని మనం యే దృష్టితో చూస్తామో మనకు అదే ప్రభావం కనబడుతుంది. ‘యద్భావం తద్భవతి’ అంటారు పెద్దలు. మన ఆలోచనలు మంచివి అయితే మనకు మంచి జరుగుతుందని నిరూపించే ఒక చిన్న కథ తెలుసుకుందాం.
2. మాధవుని పరీక్ష
మాధవుడు ఆశ్రమం లోని పిల్లలు అందరినీ ఒక మామిడి తోటలోకి తీసుకుని వెళ్ళాడు. శ్రీకరుని పిలిచి నిండుగా ఫలాలతో ఉన్న ఆ మామిడి చెట్టుని చూపించి ‘శ్రీ కరా..! ఈ చెట్టుని చూస్తే నీకు ఏమనిపిస్తున్నది?’ అని అడిగాడు. అప్పుడు శ్రీకరుడు ‘ గురుదేవా.. ఈ చెట్టు ఎంతో ఫలవంతమైనది. అంతేకాదు సృష్టిలో అత్యుత్తమమైనది కూడా..! ఎందుకంటే రాళ్ళతో కొట్టి హింసించినా ఇది మధురమైన ఫలాలనే ఇస్తుంది. మహానుభావులు కూడా అంతే కదా, లోక నిందకు గురయినా ఎవరు ఎన్ని పరుషమైన మాటలతో గాయ పరచినా వారు మంచినే చేస్తారు. ఈ చెట్టు నుండీ ఎంతో గొప్ప విషయాన్ని నేను నేర్చుకున్నాను.’ అన్నాడు. మాధవుడు అతని మిగిలిన శిష్యులంతా అతని సమాధానం తో ఎంతగానో సంతోషపడ్డారు. మాధవుడు విక్రముని కూడా అదే ప్రశ్న వేశాడు.