మహా భారతం లో కచ దేవయానుల కథ చాలా ప్రసిద్ధమైనది. అందులో భాగంగా దేవగురువు బృహస్పతి కుమారుడైన కచునికీ, దైత్య గురువు శుక్రాచార్యునికీ మధ్య జరిగిన కథ మనకు ఎన్నో గొప్ప విషయాలను చెబుతుంది. ఆ కథను తెలుసుకుందాం.
6. రాక్షసుల రెండవ ప్రయత్నం
విషయం తెలుసుకున్న రాక్షసులు కచునిపై మరింత పగ పెంచుకున్నారు. కచుణ్ణి చంపేయడానికి మరో మార్గం వెతికారు.
తరువాతిరోజు సమిధలకోసం వెళ్ళిన కచుణ్ణి చంపి, కాల్చి బూడిద చేశారు. ఆ బూడిదను మదిరలో కలిపి శుక్రాచార్యునికి ఇచ్చారు.
విషయం తెలియని శుక్రాచార్యుడు ఆ మదిరను స్వీకరించాడు. ఆరోజుకూడా ఎంతకీ కచుడు రాకపోయేసరికి దేవయాని తండ్రికి మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడు జరిగినదంతా తెలుసుకుని ఖిన్నుడైనాడు.
ఎన్ని బోధలు చేసినా రాక్షసులకు ఇసుమంతైనా జ్ఞానం కలగలేదని విసుగుచెందాడు. ఋషి అన్నవాడెపుడూ ఇక మీదట మదిరా పానం చేయరాదని శాసనం చేశాడు.
మృతసంజీవని సహాయంతో కచుడిని బ్రతికిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం. అప్పడు శుక్రాచార్యుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.