
story of no moon day
మన పురాణాలలో అమావాస్యను గురించిన ఒక కథ ప్రచారం లో ఉంది.
దక్ష ప్రజాపతి తన 27 మంది కూతుర్లను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. చంద్రుడు దక్షుని 27 మంది పుత్రికలలో రోహిణిని ఎక్కువగా ప్రేమించాడు. ఎప్పుడూ ఆమె తోనే ఉండేవాడు. ఆమె ప్రేమలో మైమరచి మిగిలిన 26 మంది భార్యలను నిర్లక్ష్యం చేశాడు. భర్త తమ పట్ల చూపిస్తున్న నిరాదరణ సహించలేక దక్షపుత్రికలు విషయాన్ని తండ్రికి విన్నవించారు. కూతుర్లకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి దక్షుడు కోపోద్రిక్తుడయ్యాడు. చంద్రుడు తన అందాన్ని చూసుకుని గర్విస్తున్నాడని భావించి. అతనికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. చంద్రుడు తన ప్రకాశాన్ని కోల్పోయే విధంగా శపిస్తాడు. శాప గ్రస్తుడైన చంద్రుడు భూలోకం చేరి పరమశివుని ఆరాధిస్తాడు. చంద్రుని తపస్సుకు మెచ్చిన పరమ శివుడు అతనికి క్రమంగా తన కాంతిని పొందేలా వరమిస్తాడు. ఆ నాటినుంచీ చంద్రుడు క్రమంగా పెరుగుతూ పౌర్ణమికి నిండుదనం సంపాదించుకుంటాడు. పౌర్ణమినుండీ క్రమంగా తరుగుతూ అమావాస్యనాడు పూర్తిగా కాంతిని కోల్పోతాడు.