
ఆహారం మనిషికి ప్రథమావసరాల్లో ఒకటి. మనల్ని తయారు చేసేది మనం తినే ఆహారమే. కాబట్టి ఆహారాన్ని బ్రహ్మముతో పోల్చాడు శ్రీ కృష్ణుడు, తన గీతా మకరందంలో. ఒకరకంగా జఠరాగ్నిలో ఆహుతి అయ్యే ఆహారము బ్రహ్మము. తినడమూ, తినేవాడూ బ్రహ్మము, చివరకు చేరే నేను బ్రహ్మము అంటాడు గీతాకారుడు. కాబట్టి తినేటప్పుడు ఈ అర్థాన్ని స్మరించుకుంటూ తినడం మంచిది. తద్వారా అన్నము పరబ్రహ్మము అనే విషయం ప్రతీసారీ గుర్తొస్తుంది. ఈ రకంగా మొదలైన ఆలోచన జ్ఞానసముపార్జన దాకా వెళ్తుంది. అన్నానికీ జ్ఞాన సముపార్జనకూ ఏమిటి సంబంధం అని అనవచ్చుగాక. అన్నము పరబ్రహ్మము, అన్నము తినే నేను బ్రహ్మము, ఆ అన్నాన్ని జఠరాగ్ని ద్వారా జీర్ణం చేసుకునే ప్రక్రియ బ్రహ్మము, ఇవన్నిటికీ కారణమైన వాడు కూడా బ్రహ్మమే. అయితే ఏమిటీ బ్రహ్మము, ఏమిటీ పరబ్రహ్మము అనే జిజ్ఞాస కలుగక మానదు. ఇది మొదటి అడుగు. ఒకసారి పరబ్రహ్మాన్ని తెలుసుకునేందుకు ఉపకరించాక ఎవరూ ఆగరు, ఆపడం ఎవరితరమూ కాదు.
ఇక మనకు అన్నాన్ని ప్రసాదించే అమ్మ అన్నపూర్ణాదేవి. మహా శివుడి ప్రేమను పొంది, ఆ ప్రేమను మనకు అన్నము రూపంలో ప్రసాదిస్తుంది ఆ చల్లని తల్లి. భుజించే ముందు ఆమెను కూడా స్మరించుకోవడం మరువకూడదు.
కాబట్టి అన్నము తినేముందు ఈ శ్లోకాలను పఠనం చేసుకుంటే శరీరానికి బలసముపార్జనతో పాటు జ్ఞాన సముపార్జన కూడా తోడవుతుంది. మనిషి యోగి అవుతాడు.
శ్లోకం 1:
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా
అన్నపూర్ణా స్తుతి:
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ
సర్వం మహాకాళి అర్పణం _/\_