మార్గశిర మాసంలో లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం | Margashira Lakshmiwara Vratam

0
14427
Method of Margashira Lakshmiwara Vrata
What the Procedure & Rules of Margashira Lakshmiwara Vrata?!

What to Do For the Grace of Goddess Lakshmi in the Month of Margasira?

3వ్రత కథ (Story of Margashira Lakshmiwara Vrata):

స్త్రీలు ఈ నోమును మార్గశిర మాసంలో నోచుకోవడానికి గల బలీయకారణాన్నే కథగా పూజాసమయంలో చెప్పుకుంటారు. ఒక పల్లెటూరిలో ఓ బ్రాహ్మణ అమ్మాయికి చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువ. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బొమ్మకు పూజలు చేస్తూ, తల్లి తినమని ఇచ్చిన బెల్లం, ఇతర తినుబండారాలు నైవేద్యాలుగా సమర్పించేది. ఒకనాడు ఆ పాప ఇంటి బయట ఆడుకుంటుండగా, వాకిట్లో ఆరబెట్టిన ధాన్యాన్ని చూస్తూ ఉండమని చెప్పి తల్లి చెరువుకు వెళ్లింది. తల్లి అటు వెళ్లగానే పాప దగ్గరికి ఒక అవ్వ వచ్చి ఓ ఇత్తడి సింహాసనమును చూపి, అది కొనుక్కోమని, లక్ష్మీదేవి బొమ్మను అందులో పెట్టి పూజించమని చెప్పింది. ఆ అమ్మాయి దానికి అంగీకరించి ధాన్యాన్ని ఇచ్చి సింహాసనాన్ని తీసుకుంది. 

ఇంతలో చెరువు నుండి తిరిగి వచ్చిన తల్లి – “చిన్నపిల్లను చేసి ఇత్తడి వస్తువు ఇచ్చి బంగారంలాంటి ధాన్యాన్ని తీసుకెడతావా?” అంటూ ఆ అవ్వను చీపురుతో కొట్టి తరిమివేసింది.

కొన్ని రోజులు గడిచాయి. ఆ అమ్మాయికి వివాహం జరిగింది. తాను పూజిస్తున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని, సింహాసనాన్ని తీసుకుని ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్లింది. ఆమె వెళ్లినప్పటి నుండి పుట్టింట్లో దరిద్ర దేవత తిష్ఠవేయగా, మెట్టినింట సకల సంపదలూ సమకూరాయి. పుట్టింటి వారి స్థితి తెలుసుకున్న ఆ అమ్మాయి ఎంతో బాధపడింది.

తండ్రిని పిలిపించింది. ఒక వెదురు బొంగు నిండా వరహాలను నింపి, “నాన్నా! దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లు” అని చెప్పి ఇచ్చింది. తండ్రి వెడుతూ దారిలో ఆ కర్రను ఒక చెట్టుకు ఆన్చి చెరువు వద్ద కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా, దారిన పోతున్న మరెవరో దాన్ని తీసుకుపోయారు. పోనీ కర్రేగదా అనుకున్నాడు తండ్రి.

మళ్లీ అమ్మాయి తండ్రిని పిలిచి ఒక ఆనపకాయను తొలిచి అందులో వరహాలు పోసి ఇచ్చింది. ఈ మారు దాన్ని నది ఒడ్డున పెట్టి, దాహం తీర్చుకునేందుకు చెరువుకు వెళ్లగా ఒక వ్యాపారి చూసి ఈ రోజు కూరకు దొరికిందని పట్టుకుపోయాడు. అది విని బాధపడింది అమ్మాయి. ఈ మారు ఒక జోళ్ల జతను శుభ్రపరచి వాటినిండా వరహాలు నింపి ఒక బుట్టలో చుట్టి ఇచ్చింది. ఈ సారి దానిని పక్కన పెట్టి ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక కుక్క వచ్చి పట్టుకుపోయింది. ఇలా జరుగుతోందేమిటా అని ఎంతో విచారించి బట్టల్లో సొమ్మును పెట్టి బొంతలా కుట్టి “నాన్నా! చలికాలం…. జాగ్రత్తగా దీన్ని కప్పుకునివెళ్లు” అని తండ్రి చేతికి ఇచ్చింది. ‘కూతురు ఏదో ఇస్తుంది, దరిద్రం తీరుతుంది అనుకుంటే…. అన్నీ ఇలాంటివే ఇస్తోంది’ అనే చులకన భావంతో బయలు దేరాడు తండ్రి. దారిలో ఎవరో బిచ్చగాడు వణుకుతూ కనిపిస్తే ఆ బొంతను అతనికి కప్పేసి చక్కాపోయాడు ఇంటికి.

వారి దురదృష్టానికి ఎంతో చింతించిన అమ్మాయి – ‘మార్గశిర మాసం‘ వస్తోంది…. తల్లి లక్ష్మీవారం నోములు నోస్తే పరిస్థితి మెరుగవుతుందేమో అని ఆలోచించి తల్లిని తీసుకురమ్మని తండ్రికి కబురు చేసింది. అలాగే వచ్చారు తల్లిదండ్రులు.

లక్ష్మీవారం రానే వచ్చింది. ‘తాను మడికట్టుకుని దేవుని పనులు, వంట పని చూసుకుంటానని, పిల్లలకు అన్నాలు పెట్టమని, ఏమీ తినకుండా ఉండ’మని తల్లిని హెచ్చరించి స్నానానికి వెళ్లింది అమ్మాయి. పిల్లలకు అన్నాలు పెట్టేసి, బోల్డు పెరుగన్నం పారేశారని దుగ్ధకొద్దీ తినేసింది తల్లి. “అయ్యో ఎంత పని చేశావమ్మా” అంటూ తానే పూజ చేసుకుంది అమ్మాయి.

అలాగే ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా రెండవ వారం అరటిపళ్లు, వెలుగపళ్లు సగానికి సగం ఉంచేశారని తినేసింది.మూడవవారం పిల్లలకు నూనెరాసి తనూ రాసేసుకుంది. ఇక నాలుగవ వారం మిగిలింది. కూతురు మరీమరీ జ్ఞాపకం చేసినా….పిల్లలకు తలరుద్ది, తాను తలంటుపోసుకుంది. 

అమ్మా! మార్గశిర లక్ష్మీవారం ఒంటికి నూనె రాసుకుని తలంటు పోసుకున్నావా” అని “లక్ష్మీవారం నాడు పూజచేసుకునే ముందు ఏమి చెయ్యకూడదని చెప్పానో అవే చేశావమ్మా! దురదృష్టవంతులను ఎవరూ బాగుచెయ్యలే”రని విసుక్కుంది. పుష్యమాసంలో తొలి లక్ష్మీవారం వచ్చింది. ఇక ఇలా కాదని కూతురు తల్లి కొంగుని తన కొంగుకు కట్టుకొని తనతో పాటే స్నానం చేయించి పనులన్నింటిని చేసుకుంది. తనతో పాటే పూజ చేయించింది. అమ్మాయి పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టగా స్వీకరించిన మహాలక్ష్మి, తల్లి పెడుతుండగా వెనక్కి తిరిగిపోయింది. “అమ్మా! మా అమ్మ చేసిన అపరాధం ఏమిటి? ఆమె పెట్టిన నైవేద్యాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు?” అని అమ్మాయి అడిగింది.

అప్పుడా లక్ష్మీదేవి – “తల్లీ! మీ అమ్మ ఆనాడు సింహాసనం పట్టుకువచ్చి నీకు ఇచ్చిన నన్ను నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొట్టింది. అటువంటి వారి ఇంట నేనెలా ఉంటాను? అందుకే నువ్వు వచ్చేశాక నేను కూడా వెళ్లిపోయాను. వారికి సిరిసంపదలు లేకుండాపోయాయి. నీవు భక్తి శ్రద్ధలతో నిత్యమూ నన్ను పూజిస్తూ, మార్గశిర మాసంలో లక్ష్మీవారపు నోములు క్రమం తప్పకుండా ఆచరిస్తున్నావు కాబట్టి నీ వద్ద ఉన్నాను. నీ పూజలూ, నైవేద్యాలూ స్వీకరిస్తున్నాను” అంది.

అందుకు ఆ అమ్మాయి – “అమ్మా! మా అమ్మను క్షమించు….వారికి అన్నవస్త్రాలకు లోటు లేకుండా చూడు. ఇకపై మా అమ్మ కూడా ఈ నోమును నోచుకుంటుంది. నిన్ను పూజిస్తూ ఉంటుంది” అని చెంపలు వేసుకుంది.

దేవి ప్రసన్నురాలై ఆ అమ్మాయి తల్లిపై దయ తలచి, వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదించింది. అప్పటి నుండి ఈ మార్గశిర లక్ష్మీవారపు నోమును అందరూ నోచుకుంటూ, నాలుగు లక్ష్మీవారములు పూజచేసుకుని పుష్యమాస లక్ష్మీవారాన్ని కూడా భక్తిశ్రద్ధలతో ఆచరించి సిరిసంపదలను, సౌభాగ్యాన్ని, సంతానాన్ని పొందుతున్నారు.