ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం
జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెంతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే ఒక చక్కని ఓషధి. కఫాన్ని వాతాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం ఈ లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవంతమైన, విలువైన ఓషధిగా ప్రసిద్ధి గాంచింది.
బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు. మెంతులను నేతిలో వేయించి, మెత్తగా చూర్ణంచేసి, దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి,తగినంత పంచదార వేసి హల్వా తయారు చేస్తారు.
స్థూలకాయం, చెడు కొవ్వులు, మధుమేహం అదుపుకు మెంతులు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖంపై బ్లాక్, వైట్ హెడ్స్ తగ్గించడానికి మెంతి ఆకులను రుబ్బి ఉపయోగిస్తారు.
జుట్టు పట్టుకుచ్చులా ఉండటానికి మెంతిపొడిని నానబెట్టి హెయిర్ ప్యాక్ వేస్తారు. అందానికి, ఆరోగ్యానికి ఔషధంగా
రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగులు, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
కఫానికి వాతానికి వ్యతిరేకంగా మెంతులు పనిచేయటం వల్ల జీర్ణక్రియలో ఆలస్యం, గ్యాస్, పొట్ట ఉబ్బరింపు తదితర సమస్యలతో కూడిన అజీర్ణాన్ని మెంతులు సరిచేయగలుగుతుంది.
నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్) ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని)తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
మెంతులను తేనె మరియు నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది
మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానం చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్గా పనిచేస్తుంది.
మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
మెంతుల్లో ఉన్న ఫైబర్ కంటెంట్ శరీరం లోని టాక్సిన్స్ ను తగ్గించి శరీరాన్ని న్యూరిష్ చేస్తుంది. దాంతో కోలెన్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది.
మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది.