
Sri Khadri Laxmi Narasimha Swamy Temple
1. కదిరి నృసింహుని వైభవం
నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.
కదిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఎప్పటిది? ఎలా ఉంటుంది?
కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.
కదిరి నృసింహ క్షేత్రం లోని అరుదైన విశేషాలు
నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
అంగరంగ వైభవంగా జరుగుతున్నకదిరి బ్రహ్మోత్సవాలు
09.03.2025 నుండి 23.03.2025 వరకు 15 రోజుల పాటు అత్యంత వైభోపేతముగ ప్రతిరోజు ఉదయం, రాత్రి కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుంచో ప్రజలు బ్రహ్మోత్సవాలను దర్శించడానికి తరలివస్తారు.