
శ్రీ భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయం
మూలాపేట, నెల్లూరు జిల్లా.
ఇది చాలా పురాతన ఆలయం. 1400 సంవత్సరాల క్రితం స్వయంభువుగా నెల్లి వృక్షము క్రింద లింగ రూపములో వెలసిన స్వామి మూలాస్థానేశ్వరుడు. ఈ ప్రదేశంలో మూలస్థానేశ్వరునికి నలువైపులా శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయము, శ్రీ వీరభద్రస్వామి దేవస్థానము, శ్రీ నీలకంఠేశ్వరాలయము వెలసియున్నవి. శ్రీ మూలస్థానేశ్వరస్వామి దేవాలయ దక్షిణ భాగమున శ్రీ సహస్రలింగేశ్వరస్వామి ఆలయము ప్రతిష్ఠించబడివున్నది. ఈ దేవాలయములోని స్వామివారిని శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లుగా పురాణముల వలన తెలియబడుచున్నది. ఈ దేవాలయము 1008 శివలింగములు ప్రతిష్ఠించబడి భక్తులచే పూజలు చేయబడుచున్నది. శ్రీ సహస్రలింగేశ్వరస్వామివారికి ఒకసారి అభిషేకమును చేసుకొన్నచో 1008 శివలింగములకు అభిషేకము చేయుఫలితములు కలుగును.
శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి ఎడమ వైపున భువనేశ్వరి అమ్మవారు కొలువుదీరియున్నారు. అమ్మవారి ప్రదక్షిణ మండపము చుట్టూ నవదుర్గలు కొలువైయున్నారు. శ్రీ స్వామి ప్రదక్షిణ మండపము చుట్టూ దక్షిణ భాగమున శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు, శ్రీ దక్షిణామూర్తి స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, పడమర భాగమున శ్రీ విష్ణుమూర్తి, ఉత్తర భాగములో బ్రహ్మ, దుర్గాదేవి మందిరములు కలవు.
స్థల పురాణము
పూర్వము త్రినేత్రుడని పిలువబడిన ముక్కంటిరెడ్డి అను పేరుగల నాయకుని వద్ద పెద్ద పశువుల మంద ఉండేది. ఆ మందలో ఒక గోవు దేహమున మృతి చెందిన బ్రాహ్నణ స్త్రీ ఆత్మ ప్రవేశించినట్లు, ఆ గోవునకు శివుడు నెల్లి చెట్టు క్రింద లింగాకారములో వెలసినట్లు స్ఫురించి ప్రతి దినము ఆ శివలింగమునకు తన పాలతో అభిషేకము చేయుచుండెను. ఆవు తక్కిన ఆవులవలె సరిగా పాల నివ్వకుండుటను సరిగా గమనించని పశువుల కాపరిని ముక్కంటిరెడ్డి మందలించగా ఆ పశువులకాపరి ఆవు దినచర్యను గమనించెను. నెల్లి చెట్టు వద్దకు పోవుట పాలతో శివలింగమును అభిషేకించుండుటను గమనించి ముక్కంటిరెడ్డికీ వృత్తాంతమును తెలియజేసెను. రెడ్డి ఆశ్చర్య పోయెను. ఒక రోజు ముక్కంటిరెడ్డి కలలో శివుడు కనిపించి శివలింగమున్న చోట ఆలయాన్ని కట్టించమని చెప్పెను. ఆ ప్రకారము ముక్కంటిరెడ్డి ఆలయాన్ని కట్టించెను.
https://www.facebook.com/793499987384826/photos/pcb.989164304485059/989163717818451/?type=3&theater