
According to Dharma Shastras, That is the Virtue With Those Flowers
1. Divine Flowers Which Are Favorites of Hindu Gods (హిందూ దేవతలకు ఇష్టమైన దివ్య పుష్పాలు)
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో స్థితికారకుడైన శ్రీమహావిష్ణువును ఏ పూలతో అర్చిస్తే ఎంతటి ఉత్తమ ఫలితం లభ్యమౌతుందో తెలిపే విషయాలు శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణంలోని అష్టాదశవిధ వ్యవహార ప్రకరణంలో కనిపిస్తుంది. లక్ష పుష్పార్చనలు, కోటి కుంకుమార్చనలు ఎందుకు జరుపుతుంటారనే విషయం కూడా దీనివల్ల తెలుస్తుంది. శ్రీమహావిష్ణువుకు చేసే సేవలన్నింటిలోకి పుష్ప సేవే ముఖ్యమైనది.
ఒక్కో పూలతో ఒక్కో ఫలితం:
పుష్పాలతో శ్రీమహావిష్ణువును అర్చిస్తే సిరిసంపదలు అధికంగా లభిస్తాయి. విష్ణువును అర్చించటానికి పువ్వులేవీ లభించని పక్షంలో గరికమొలకలు సమర్పించినా సువర్ణదాన ఫలితం కలుగుతుంది. పురంధి పుష్పాలను, పచ్చ కర్పూరపు వాసనలతో ఉండే ముదురు ఎరుపు దారంతో మాలగా గుచ్చి విష్ణువుకు అర్పించటం ఎంతో శ్రేష్టం. ఇలాంటి దండలతో అర్చిస్తే సర్వ యజ్ఞఫలం లభిస్తుంది, నూరు వాజ పేయ యాగాలు చేసినంత ఫలం దక్కుతుంది. అదే లక్ష మాలలు సమర్పిస్తే సర్వ యజ్ఞఫలం లభిస్తుంది. అంతేకాక స్వర్గలోకం కూడా ప్రాప్తిస్తుంది. కుంకుమ పూలను కానీ మంకెనపూలను కానీ నల్ల కలువలతో చేర్చి, కూర్చి హరికి సమర్పించినా ఇటువంటి ఫలమే దక్కుతుంది. కేవలం నల్ల కలువలనే సమర్పిస్తే సువర్ణ దానఫలం, వీటినే వంద సమర్పిస్తే వహ్నిష్టోమ ఫలం, వెయ్యి సమర్పిస్తే పౌండరీక యజ్ఞఫలం, లక్ష సమర్పిస్తే రాజసూయ యాగఫలం దక్కుతాయని విష్ణుధర్మోత్తర పురాణం చెబుతోంది. వంద తెల్ల కలువలతో పూజ చేస్తే చంద్రలోకం, వెయ్యి సమర్పిస్తే సువర్ణదానం చేసిన ఫలితం వస్తుంది. జూకామల్లెపూలతో అర్చన చేస్తే వహ్నిష్టోమ యాగఫలం లభిస్తుంది.
వెయ్యి పూలతో అర్చిస్తే సూర్యలోకంలో గౌరవం లభిస్తుంది. జూకామల్లెలే లక్ష తీసుకువచ్చి పూజ జరిపిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఎర్రటి పద్మాలతో హరిని అర్చిస్తే జూకామల్లెలతో చేసిన దానికన్నా రెండింతల ఫలితం దక్కుతుంది. చంపక పుష్పాలతో చేసిన పూజ నీలోత్పల పుష్పార్చన ఫలితంలో సగం ఫలితాన్ని ఇస్తుంది. జాజిపూలతో శ్రీమహావిష్ణువును అర్చిస్తే గంధర్వలోకంలో ఆనందించే అవకాశం లభిస్తుంది. లక్ష జాజిపూలతో అర్చనచేస్తే శ్వేతద్వీపవాస సౌఖ్యం కలుగుతుంది. పచ్చకర్పూరపు వాసనతో ఉండే జాజిపూలను విష్ణువుకు అర్పిస్తే కూడా శ్వేతద్వీపవాసం లభిస్తుంది. తెల్లనిపువ్వులు ఏవీ తీసుకువచ్చి పూజచేసినా కోరికలు ఈరేడుతాయి. పచ్చని పూలతో చేసిన పూజ ఆనందకర ఫలితాన్ని ఇస్తుంది. బంగారు పువ్వులతో రాజసూయ యాగఫలం దక్కుతుంది. రత్నాలతో పూజిస్తే రాజయోగం ప్రాప్తిస్తుంది. పూవులతో గృహాన్నిగానీ, పందిరినికానీ అలంకరించి శ్రీహరికి అర్పిస్తే రాజసూయ అశ్వమేథయాగాల ఫలం పొందవచ్చు. ఇలా శ్రీమహావిష్ణువును పూజిస్తే సర్వశుభాలూ భక్తులకు కలుగుతాయని విష్ణుధర్మోత్తరపురాణం చెబుతుంది.
ఇలా చేయకూడదు (Don’t Do Like This):
బంగారం, రత్నాలు ఇతర ధనరాశులకన్నా మల్లెలు, కేతకి, చంపకం, మామిడిపూలు, మంకెన, కుంకుమపూవులు, మల్లెలు, పారిజాతాలు, నల్ల, ఎర్ర, తెల్ల కలువలు శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనవి. అయితే ఎవరో తెచ్చినవో, వాడిపోయినవో, చాలాకాలం కిందటివో అయిన పూలతో పూజ చేయకూడదు. భక్తుడు స్వయంగా వెళ్లి ఆ చెట్ల నుంచి ఆ పూలను తీసుకువచ్చి పూజ చేసినప్పుడే భగవానుడి అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
పరమ భక్తితో, ఏకాగ్రతతో ఈ పూజలు చేయాలని, ఒకవేళ పువ్వులే వీ దొరకపోతే గరికలాంటి ఆకులు, అవీ దొరకని పక్షంలో శుద్ధ ఉదకం అయినా శ్రీమహావిష్ణువుకు సమర్పించవచ్చని విష్ణుధర్మోత్తరం వివరిస్తోంది. ఈ కథాంశంలో పురాణ సందర్భంలో ఎన్నెన్నో రకరకాల పూల ప్రస్తావన ఉంది. వాటిలో ఇప్పటివారికి కనని, విననవి కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇటువంటి కథా సందర్భాలు సంప్రదాయకంగా భారతావనిలో ఎలాంటి ఉత్తమ పూలమొక్క లుండేవీ, వాటి పుష్పాల గొప్పతనం ఎంతటిది అని తెలుసుకోవటానికి చక్కగా ఉపకరిస్తుంది.