తాబేలుశైలి

0
995

గీతాచార్యుడు గీతలో కొన్ని విషయాలను అతి సరళమైన ఉపమానాలతో వివరించాడు. మనిషి సురక్షితంగా ఉండాలంటే తాబేలుశైలిని అనుసరించాలని గీత బోధిస్తోంది. తాబేలు వ్యవహారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దాని శరీరంమీద అతిగట్టి పెంకు పదార్థం ఉంటుంది. ఏ విధంగానైతే మనిషి నెత్తిమీద శిరస్త్రాణం (హెల్మెట్) పెట్టుకుంటాడో అలాగే తాబేలు శరీరం మొత్తానికి ఒక హెల్మెట్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రమాదాన్ని పసిగడితే అది వెంటనే తన అవయవాలు అన్నింటినీ ఆ చిప్పలోకి లాగేసుకుంటుంది. ఆ కార్యం ఒక్క క్షణంలో జరిగిపోతుంది.

మనిషికి మొత్తం పది ఇంద్రియాలుంటాయి. అందులో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాల ద్వారా మనం కర్మలు చేస్తాం,జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సంపాదిస్తాం. ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేకరకాలైన భోగాలను అనుభవిస్తూంటాడు.

కర్మేంద్రియాల ద్వారా మనం కర్మలు చేస్తాం,జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని సంపాదిస్తాం. ఈ ఇంద్రియాల ద్వారా మనిషి అనేకరకాలైన భోగాలను అనుభవిస్తూంటాడు.

కర్మేంద్రియాలద్వారా మనం శరీరాన్ని పోషించుకుంటాం. జ్ఞానేంద్రియాలద్వారా జ్ఞానసముపార్జన చేస్తాం. ఈ ఇంద్రియాలను వాటికొరకే వాడుకోవాలి గాని భోగానికి కాదు. భోగంలో పడేవాడు రోగాలపాలౌతాడు. అగచాట్ల పాలౌతాడు. లక్ష్యాలను సాధించలేకపోతాడు. లక్ష్యాలను సాధించాలంటే బుద్ధి తేజోవంతంగా ఉండాలి.

ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం కాగానే తాబేలు తన అవయవాలను లోపలకు ముడుచుకుంటుంది. అలాగే ప్రజ్ఞావంతుడు ఉన్నతమైన లక్ష్యాన్ని చూసి, అల్పమైన ఇంద్రియభోగాలను విడిచిపెడతాడు. అతడి బుద్ది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది.

అర్జునుడు తన గురువుకి ప్రొద్దున్నే కమండలాల్లో నీళ్ళు తెచ్చిచ్చి వినమ్రంగా పాఠాలు నేర్చుకునేవాడు. ఒక రోజు రాత్రి భోజనంవేళలో గాలికి దీపం ఆరిపోయింది. వెలుగు లేకపోయినా చేతిలోని ఆహారం నోటిదగ్గరకే పోవడం గమనించి చీకటిలోకూడ బాణాలు వేయవచ్చుననే తలంపు అతనికి కలిగింది. ఆ విధంగా అతడు బాల్యోచితమైన ఆట పాటలు మాని రాత్రుళ్ళు కూడ అస్త్రవిద్యను అభ్యసించేవాడు. అందుకే అర్జునుడి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. అతడి శ్రద్ధను చూసే ద్రోణుడు మాటిస్తూ “నిన్ను లోకైక ధనుఆర్ధారిగా చేస్తాను” అని ప్రోత్సహించాడు. ఎవరైతే దీక్షతో తపస్సు చేస్తారో వారికి వరాలు నిశ్చయంగా కలుగుతాయి. తపస్సులో ముఖ్యభాగం ఇంద్రియభోగాన్ని విడిచిపెట్టడం. లక్ష్యసాధన తరువాత కలిగే అద్భుతమైన ఫలితాలను సాధించాలంటే విద్యార్థులు, యువత తాత్కాలికమైన ఇంద్రియభోగాలు విడిచిపెట్టాలి. బలవంతంగా ఎవరైనా ఇంద్రియభోగాలు అందించాలని ప్రయత్నిస్తే తాబేలులాగా ఇంద్రియాలను లోపలకు ముడుచుకోవాలి. ఇంద్రియాలు ఆయా ఇంద్రియార్థాలమీదకు వెళితే బుద్ధి లక్ష్యంమీద నిలువలేదు. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించి, తగు మొత్తంలో వాటిని వాడుకుంటూ లక్ష్యసాధనలో నిలపడమే తక్షణకర్తవ్యంగా భావించాలి.

అరచేయి చూసి మనిషి స్వభావం ఎలా తెలుసుకోవచ్చును? | Palm Reading in Telugu?