
Sri Vishnu Puranam In Telugu
శ్రీ విష్ణు పురాణము- వరాహావతారం
” ఈ కల్పాదులలో నారాయణుడైన బ్రహ్మ సర్వభూతమయ ప్రపంచాన్నీ ఎలా సృజించాడు?” అని మైత్రేయుడు అడగ్గా పరాశరుడిలా సమాధానించాడు.
“మైత్రేయా! నారాయణుని గురించి మహర్షులవచనం ఇది. ఆపః – అంటే నీరు. నారము అనబడినది. అవి నరునకు జన్మస్థానం. నారాః + అయనం యస్యసః ‘నారాయణః’ అనే శబ్దాన్ని బట్టి ఈ నిర్వచనం ఏర్పడింది. అంటే – నీటియందు మొదట ఆయన విశ్రమించాడని అర్థం!
ప్రళయంలో – ఎటువైపుచూసినా నీరే గనుక, సృష్టియావత్తూ నీటిలోనే ఉందని ప్రజాపతి గ్రహించి, ఈ భూమిని పైకి ఎత్తాలని, పరమేష్టి(బ్రహ్మ) కోరాడు. అదే కదా సృష్టిచేయడానికి మూలభూతమైనట్టిది.
అప్పుడా నారాయణుడు పూర్వకల్పాదులలో వలెనే తాను ధరించిన మత్స్యకూర్మ రూపాలను ధరించాడు. అలాగే వేదంయజ్ఞరూపేణ నెలకొని ఉన్నందున, ఆదివరాహంగా అవతరించాడు. సనకాది ఋషులు ప్రస్తుతిస్తుండగా, తనకు ఆధారమైన పరమాత్మ ధరణిని (భూదేవిని) దాల్చి పాతాళంలోనికి ప్రవేశించాడు.
అప్పుడా ఆదిసూకర వేదవేద్యుని చూసిన పృధ్వి, భక్తి వినమ్రతల చేత వరాహమూర్తిని గుర్తెరిగి, తనకూ ఆధారమైనట్టి ఆ పరమాత్మను స్తుతించింది…
పృథివ్యువాచ
నమస్తే పుండరీకాక్ష తుభ్యం శంఖ గదాధర |
మాం ఉద్ధరాస్మాదద్యత్వం త్వత్తోహం పూర్వముత్థితా ||
త్వయాహముద్ధృతా పూర్వం తన్మయా హం జనార్దన |
తథాన్యానిచ భూతాని గగనాదీ న్య శేషతః ||
నమస్తే పరమాత్మా త్మన్ పురుషా త్మన్నమోస్తుతే |
ప్రథాన వ్యక్త భూతాయ కాలభూతాయతే నమః ||
త్వంకతా సర్వభూతానాంత్వంపాతా త్వంవినాశకృత్ |
సగా దిషుప్రభో బ్రహ్మవిష్ణురుద్రాత్మరూపధృత్ ||
సంభక్షయిత్వాసకలం జగత్యేకాణవీకృతే |
శేషేత్వమేవగోవింద చింత్యమానోమనీ షిభిః ||
భవతోయత్పరం రూపంతన్న జానాతికశ్చన |
అవతారేషుయద్రూపంతదచంతి దివౌకసః ||
త్వామారాధ్యపరంబ్రహ్మయాతాముక్తింముముక్షవః |
వాసుదేవమనారాధ్య కో మోక్షం సమవాప్స్యతి ||
యత్కిఞ్చి న్మనసాగ్రాహ్యం యద్గ్రాహ్యం చక్షురాదిభిః |
బుద్ద్యాచయత్పరిచ్చేద్యం తద్రూపమఖిలంతవ ||
త్వన్మయాహంత్వదాధారాత్వత్సృష్టాత్వ్తత్స మాశ్రయా |
మాధవీమితి లోకోయమభిధత్తే తలోహిమాం ||
భూదేవి చేసిన వరాహస్తుతి
“ఓ పుండరీకాక్షా! శంఖచక్రగదాధరా! నా నమస్సుమాంజలిదిగో! పూర్వం నన్ను ఉద్ధరించినట్టుగానే, ఇప్పుడు కూడ నన్ను ఇందులోంచి ఉద్ధరించు! అప్పుడు నేను నీ స్వరూపమే (నీ స్వంతమే) అయినాను. ఆకాశాది సర్వభూతాలు – సర్వజగత్తులూ నీవే!