పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు అయిదు కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.
చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండలు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.! ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.
ఎలా చేరుకోవాలి
* రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప చేరుకోవచ్చు.
* దేశంలోని అనేక ప్రాంతాలనుంచి రవాణాసౌకర్యం ఉంది.
* కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలినడకన ముందుకెళ్లి స్వామిని దర్శించుకోవాలి.