
ఆదిశంకరులు శైవులు కదా! మరి ఆయన భజగోవిందం, విష్ణు సహస్రనామ భాష్యంలాంటివి ఎందుకు రచించారు?
Adi Shankaracharya Charitra Telugu మనకి రానురాను మన మతం పట్ల అవగాహన లేకుండా పోతోందనడానికి ఈ ప్రశ్నే ఉదాహరణ. ఆదిశంకరులు శైవులూ కారు, వైష్ణవులూ కారు. సర్వమూ ఒకే పరమాత్మ అనీ, శివుడన్నా విష్ణువన్నా శక్తి అన్నా ఉపాసకులు కొలిచే అసలు తత్త్వం ఆ పరమాత్మయేనని ఆదిశంకర హృదయం. వారి దృష్టిలో శివకేశవ భేదం లేదు. అభీష్టదేవతా సిద్ధాంతం వేరు, దేవతల మధ్య భిన్నత్వాన్ని చూడడం వేరు. మన అభీష్ట దేవతను ప్రధానంగా కొలిచినా, ఇతర దేవతలను నిరసించరాదు. ఈ సిద్ధాంతమే మన సమగ్ర హిందూ(వైదిక, సనాతన)మతాన్ని కలిపి, క్షేమంగా ఉంచుతుంది. వేదప్రతిపాదితమైన మతమిది. సర్వదేవతలను ఒకే పరతత్త్వం యొక్క స్వరూపాలుగా దర్శించారు కనుక, విష్ణువుపై, శివునిపై, శక్తిపై, గణపతిపై, స్కందునిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు.
సమగ్ర హిందూమత సమన్వయానికి జగద్గురువై భాసించారు. సిద్దాంతరీత్యా ఆదిశంకరులది అద్వైతం, ఈ సిద్ధాంతంలో దేవతా భేదాలు కూడా ఉండవు. శైవం, వైష్ణవం ఈ రెండూ కూడా ద్వైత సిద్ధాంతంలోనూ, విశిష్టాద్వైత సిద్ధాంతంలోనూ “చేరతాయి.
ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్దాంతాలు మూడూ వేదానికి సంబంధించినవే. తత్త్వ దృష్టితో వాటిని సమన్వయించి విభిన్న బౌద్ధిక స్తాయిలకి చెందినవిగా గౌరవించడమే అసలైన వివేకం. ఇసుమంత కూడా పరస్పర విభేదం పనికిరాదు.