
Importance of Amla Tree In the Karthika Masam in Telugu?
ఉసిరిచెట్టు నీడన పిండప్రదానం చేసినవారి పితరులు నరకం నుంచి విముక్తులౌతారు. ఎవరైతే తన శిరసు, ముఖ, దేహం, చేతుల్లో ఉసిరిపండును ధరిస్తున్నారో వారు సాక్షాత్తు విష్ణుస్వరూపులని తెలుసుకోవాలి. ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వారు జీవన్ముక్తులే. ఉసిరిపండ్లని, తులసిదళాల్ని కలిపిన జలాలతో స్నానం చేస్తే గంగా స్నానఫలం లభిస్తుంది. ఉసిరి పత్రితోగానీ, ఫలాలతో గానీ దేవతాపూజ చేసినవారికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేసే యజ్ఞయాగాలు, తీర్ధ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి.
సమస్త దేవతలూ మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించి ఉంటారు.
ఏ నెలలో అయినా సరే, ఎవరైతే ద్వాదశినాడు తులసిదళాలను, కార్తీకం ముప్పై రోజుల్లో ఉసిరిక పత్రిని కోస్తున్నారో వారు నింద్యాలైన నరకాలనే పొందుతున్నారు. కార్తీకమాసంలో ఎవరైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తారో వారి ఒక సంవత్సరం దోషం తొలగిపోతుంది. ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలను, మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గానీ, సహస్రముఖుడైన శేషునికి గానీ సాధ్యం కాదు.
ఈ ధాత్రీ తులసీ జనన గాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకుని, తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గం చేరతారు.