పితృదేవతలు ఎవరు? వారికి శాస్త్ర ప్రకారం ఎంతకాలం శ్రాద్ధకర్మలాచరించాలి?

1
8330

మన ముత్తాతలు, తాతలు మొదలైనవారు, తాము చేసిన పుణ్యకార్యాల వల్ల పితృదేవతలవుతారు. భారతంలో భీష్ముడు ధర్మరాజునకు పితృయజ్ఞ విశేషాలు చెప్పాడు. దేవతలు కూడా, పితృదేవతాపూజను చేస్తారు. పితృదేవతా పూజ సమగ్రమైంది. మనుష్యులకు పితృ సమారాధనం సర్వ శుభకరం. దీన్నే పితృయజ్ఞం పిండ ప్రదానమని పిలుస్తారు.

 

జరత్కారుడనే ముని ఒకసారి ఒకచెట్టు కొమ్మకు, కాళ్ళు తగిలించి, తలలు క్రిందకు వేలాడుతున్న ఋషులను చూచాడు. అదేదో క్రొంగ్రొత్తదియగు మహా తపస్సుగా భావించి వారిని అడిగాడు. వారు అందుకు “నాయనా! మేము పితృదేవతలం, భూలోకంలో మా వంశం ఎంతకాలం కొనసాగుతుందో అంత కాలం మాకు ఊర్ధ్వలోక సౌఖ్యాలు సిద్ధిస్తాయి. మా వంశంలో జరత్కారుడనే దౌర్భాగ్యుడు పుట్టాడు. వాడు పెండ్లిపెటాకులు లేకుండా తిరుగుతున్నాడు. భూలోకంలో మా వంశం క్షయిస్తుంది గనుక మాకు, ఉన్నత లోకప్రాప్తి నశించిం”దని చెప్పారు. అది విని తానే జరత్కారుడనని చెప్పి అతడు వివాహం చేసుకుని పుత్రునికని వంశాన్ని విస్తరించినట్లు భారతగాథ.

 

ఇక పితృదేవతలకు, మూడు తరాల వరకు పిండతర్పణం చెల్లిస్తారు. ఒక వ్యక్తి తన తండ్రికి, తన తాతకు (తండ్రికి తండ్రి), తన ముత్తాతకు (తాతకు తండ్రి) పిండ ప్రదానం చేస్తాడు. అతడు మరణించి, అతని కుమారుడు పిండ ప్రదానం చేసేటప్పడు తన తండ్రికి, తాతకు, తన ముత్తాతకు శ్రాద్ధం పెడతాడు. ఇప్పడు తండ్రి ముత్తాత వెళ్ళిపోయాడు. ఆ తరువాత తరం వచ్చే వరకు, తన ముత్తాత వరకు మాత్రమే శ్రాద్ధం చెల్లిస్తాడు. కాబట్టి పితృదేవతలకు, మూడు తరాల దాకా, శ్రాద్ద కర్మలు నిర్వర్తించటం శాస్త్ర సమ్మతం.

1 COMMENT

  1. పిండములు జేసి పితరుల తలబోసి ,
    కాకులకు పెట్టెడి కాకి గాడ్డెలారా !
    పెంట తినెడి కాకి పితరుడెట్లాయెరా
    విశ్వదాభి రామ వినుర వేమ.

    తర్వాత
    అసలు పుణ్యాలు చేస్తే స్వర్గానికి వెళతారని చెప్పి, ఇప్పుడేమో పితృ దేవతలుగా మారతారనీ రమ దేనిని నమ్మాలి. సరే మనం పిండాలు పెట్టామనుకోండి. వారు నిజంగా స్వీకరిస్తారని గ్యారంటీ ఏంటి ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here