1001 Srichakrameruvula Temple
శ్రీకాకుళం జిల్లా ప్రపంచ ఆధ్యాత్మిక నెలవుగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి పొందిన శ్రీకూర్మనాధస్వామి ఆలయం, ప్రత్యక్ష దైవం అరవెల్లిలో కొలువైన సూర్యనారాయణ స్వామి ఆలయం ఉన్నాయి.
ఇప్పుడు 1001 శ్రీచక్ర మేరువులతో రాజరాజేశ్వరి దేవిఆలయంతో ఆధ్యాత్మికశోభ సంతరించుకోవడంతో శ్రీకాకుళం ‘ప్రత్యేక ఆలయాల సిక్కొలుగా’ ప్రపంచపటంలో చోటు చేసుకుంది.
ఈ 1001 శ్రీచక్ర మేరువుల ఆలయం ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట గ్రామ పరిధిలో నెలకొల్పారు. దీనిని ఏకోత్తర సహాస్ర శ్రీచక్రమేరువుల రాజరాజేశ్వరీ దేవి ఆశ్రమంగా కొలువబడుతోంది.
ప్రపంచంలోనే ఇది మొదటిదని, ఇటువంటి ఆలయం ఎక్కడా చూడలేదని, త్వరలో ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని దీనిని నిర్మించిన శ్రీవిద్యోపాసకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ధన్యుడని, నడిచే శివుడిగా పేరుగాంచిన శ్రీకంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి వారు స్వయంగా అన్నారు. ఈ ఆలయం మొత్తం 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగంలో సుమారు 250 శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు. మధ్యలో 9 అడుగులు ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో మహా మేరువు నిర్మాణం జరిగింది.
సమస్త సృష్టికి కారకులు పార్వతీ పరమేశ్వరులని ప్రతీతి. వీరి వ్యక్తరూపమే శ్రీచక్రమేరువు. ఈ మేరువు మూడు విభాగాలుగా ఉంటుంది. పైన మేరు ప్రస్తారం, మధ్యలో కైలాస ప్రస్తారం, అడుగున భూప్రస్తారం. ఈ మూడు కలయకే శ్రీచక్రమేరువు. మన శరీరమే మేరువు. మన శిరస్సే బిందువు మనలోని బుద్ధిని సహస్రారంలోని ఆత్మతో అనుసంధానించడమే శ్రీచక్రార్చనలోని రహస్యం అని పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి మేరువును అర్చిస్తే సకల దోషాలు తొలగి అష్టరైశ్వర్యాలతో ఉంటారని పీఠాధిపతుల ఉవాచ. ఈ శ్రీచక్రాన్ని లలితాదేవి అన్న భావనతో అర్చన చేస్తే అమ్మ కృప లభిస్తుంది. ఒక మేరువును పూజిస్తే అపారమైన శక్తి లభిస్తుందని నమ్మకం. ఇక్కడ ప్రతిష్టించిన 1001 శ్రీచక్రాలను అర్చన చేస్తే అపారమైన శక్తి వస్తుందని, శరీరంలో మరింత శక్తి వచ్చి కాంతివంతంగా అవుతుందని పలువురు పండితుల భావన.
1001 శ్రీచక్రాల చుట్టూరా చతుష్టి యోగినీ దేవతామూర్తుల విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్య, బీజాక్షరాలైన ‘అ’ నుండి ‘క్ష’ వరకు ఉన్న తెలుగు అక్షరమాలలతో ఉన్న దేవతామూర్తులు ప్రత్యేకత. ఈ విధంగా దేవతా విగ్రహాలు మహామేరువు చుట్టూరా ప్రతిష్టించడం విశేషం. అలాగే 40 అడుగుల ఏకశిలతో ధ్వజస్తంభం ఓ ప్రత్యేకత.
Exact location cheppagalara suryanarayan temple nundi entha duram?