శ్రీఘ్రముగా వివాహము
ప్రతి తల్లి, తండ్రి కూడా తమ పిల్లలకు యుక్త వయస్సు వచ్చిననాటి నుండి వారికి సరి అయిన జీవిత భాగస్వామిని అన్వేషించి వివాహం చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. ఆ ఆరాటం ఉండాలి కూడా. అలా ఉంటేనే ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట ఆ వయసుకు జరుగుతుంది. కాని, కొన్ని కారణాంతరాల వల్ల తల్లితండ్రులు ఎంత ప్రయత్నించినప్పటికీ వివాహ సంబంధాలు ఇక కుదరబోతోందా అని అనుకునేలోపలే అంతుబట్టని కారణాల చేత వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఇలాంటి తరుణంలో మనకి అనేక రకాల తరుణోపాయాలను తెలియచేశాయి. అందుకనే మనం ప్రతి ఒక్కరం కూడా మన ఋషులకి రుణపడి ఉన్నాము. ఏ అబ్బాయికి లేక అమ్మాయికి వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళుతున్నాయో అలాంటి వారు, వారి పిల్లలని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మురమళ్ళ లో ఉన్న ‘భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి’ వారికి కనుక కళ్యాణం చేయిస్తే తప్పకుండా వారి పిల్లలకి త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది.
దక్షయజ్ఞం భగ్నం కాగానే వీరభద్రస్వామి ఇంకా అలాగే రౌద్రంతో ఊగిపోతూ ఉంటే, ఆయనను శాంతపరచడానికి దేవతలు అందరూ ప్రయత్నించారు. ఎంతకూ ఆయన తన ఉగ్రరూపాన్ని వీడలేదు. అప్పుడు ఆయనను శాంత పరచడానికి నవదుర్గలలో ఒకరు, ఆ గోదావరిలో స్నానమాచరించి ఒడ్డునకి వస్తున్న కన్నెపిల్లలా కనిపించగా, ఆ రూపాన్ని చూసి వీరభద్రుడు శాంతించాడు. ఆవిడే భద్రకాళి. వీరిద్దరూ కూడా అక్కడ ఉన్న మునిపల్లెకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అదే ఇప్పుడు మురమళ్ళ అమ్మవారు. అమ్మవారు, అయ్యవారు ఎకపీఠం మీద ఉంటారు. చాలా ప్రసిధ్ధి చెందిన దేవాలయము. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెల్లివిరుస్తున్న క్షేత్రం. మన మురమళ్ళలో ఉన్న ‘భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి’ వారి దేవాలయం.
ఈ దేవాలయం తూర్పు గోదావరి జిల్లాలో ఐ. పోలవరం మండలం లో ఉంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు 27 కళ్యాణాలు నిర్వహిస్తారు. ఈ కళ్యాణాలు నిర్వహించేటప్పుడు అబ్బాయిలవి, అమ్మాయిలవి నక్షత్రాలను బట్టి యోగ్యతా కాలాలను నిర్ణయిస్తారు. సాయంకాలం పూట కళ్యాణాలను యక్షగాన సహితంగా నిర్వహిస్తారు. క్రొత్తగా వివాహం అయిన జంటలకు ఆ దేవాలయంలో ఏ సమయంలోనైనా అర్చకులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఎంత ఓర్పుగలవారో కదా,
ఆ దేవాలయ అర్చకులు. వీరికి సంబంధించి ఒక Website కూడా ఉంది.
ఈ Link http://www.sriveereswaraswamytemple.com/timings.php?page=timings
click చేసి మీరు సమాచారాన్ని పొందవచ్చు.
అందులో మనకి కావలసిన సమాచారం అంతా అందుబాటులోకి వస్తుంది. ఎవరైతే తల్లితండ్రులు వారి పిల్లలకు వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో మరి ఇంకెందుకు ఆలస్యం, వారి నక్షత్రానికి అనుగుణంగా ఏ రోజు ‘భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి’ వార్లకి కళ్యాణం చేయించడానికి యోగ్యమో దేవాలయంలో కనుక్కుని మీ పేరు నమోదు చేసుకుని ఆ దేవతల కృపకు పాత్రులు కండి. ఇక్కడ కావలసింది విశ్వాసం. విశ్వాసం ఉంటే ఆధ్యాత్మికతలో మనము దేనినైనా పొందవచ్చు.
కళ్యాణమస్తు.
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి